Saturday, June 19, 2010

ఈ కవిత కూడా నేను హౌస్ సర్జన్ గా ఉన్నపుడు రాసింది..ఒక వ్యక్తి జీవితం అంతా ఒక కవితలో చెప్పే ప్రయత్నంలో అది రాసాను...
నేడు నేను కళ్ళు తెరిచాను,
ఏదో కొత్త లోకం.
ఇన్నాళ్ళు నేనున్నదానికంటే అందంగా,
వర్ణరంజితంగా శతవిధకళాశోభితంగా,
అత్యంత సుందరంగా అనిపించిందీ లోకం,
భూలోకం.
నీలినింగిని చూసి అపుడాశించా దానిని అందుకోవాలని,
రెక్కలు లేని పక్షినైనందుకు వెళ్ళలేకపోయా.
తిరిగి చూస్తే పచ్చని ప్రకృతి,
చిగురుటాకులతో నవవసంతశోభతో ఉన్న చెట్లు
వాటిలా అనందంగా అందంగా ఎదగాలని ఆశపడ్డా.
కొన్నాళ్ళు గడిచాయి
"నింగిలో రాత్రి మాత్రమే ఎందుకు చుక్కలు ?"
"నే పగలు కూడా దానికి అద్దుతా చుక్కలు" అని చెప్పి
ఎగిరేసా గాలిపటాన్ని
అది నింగిని చేరి చుక్కయ్యింది.
పచ్చని ఆకులను ప్రక్కకునెట్టి
కొమ్మల చాటున దాగిన పండ్లకై
తిరిగా చెట్లవెంట .
ఆ తర్వాత
ఇవి కావు అందాలు ఇలలోన ,
నవ యవ్వనంతో నునుసిగ్గుల మొగ్గలతో,
అలరారే భామలదే అందం అనుకున్నా ,
చిరుప్రేమల చెలగాటంలో చిక్కుకున్నా,
విధి వైచిత్రిలో కొన్నాళ్ళు విచారించా విరహంతో.
మరలిపోయాయి ఆ రోజులు.
ఆ పై,
నేను ఒక ఇంటికి పెద్దగా,
నలుగురిని శాసించే వ్యక్తిగా అనుకున్నా,
సర్వహక్కులు నావేనని,
అందరూ నా మాటే వినాలని భావించా.
అటూ తర్వాత ,
"నేనెవరిని శాసించటానికి?"
"నేనెవరు?నాకు ఎందుకు ఈ జీవిత వరమిచ్చావయా?" అనుకున్నా .
"ఏమీ లేదు ఈ ప్రకృతిలో వేరువేరుగా అందం,
అంతా అంతర్లీన బ్రహ్మమయం" అని తెలుసుకున్నా.
సాయం సంధ్యలో ఉన్న నేను
మూగవోయి ఈ లోకంతో వీడుకోలు అన్నా,
అంతలో చేరుకున్నా,
ఆత్మానందతీరాన్ని
పరమాత్మ సాన్నిధ్యాన్ని .